• లేని రోగాలను, ఉన్నట్లు “మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్’. జారీ చేస్తున్న వైద్యాశాఖలోని పలువురు అధికారులు.
• ఈ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న పలువురు ఉద్యోగుల వారసులు.
• జాబ్ పొందక ముందు మెడికల్ గా అన్ఫిట్.. జాబ్ పొందాకా మెడికల్ గా ఫిట్…..?
• ఇదేమిటని ప్రశ్నిస్తే “మెడికల్ మీరాకిల్’…. వైద్య శాస్త్రంలో ఇలా జరగడం సహజం అంటున్న కొంత మంది వైద్యులు.
• ఇలాంటి ఉద్యోగాల పట్ల వైద్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
• ఇవన్నీ చూస్తూ నిద్రపోతున్న ఇంటలిజెన్స్ వ్యవస్థ.
• ఇలాగైతే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షే….?
జూలై 14/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
5 లక్షలు ఇస్తే వైద్య , ఆరోగ్య శాఖలో ఏదైనా జరిగిపోద్దట. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉన్నా 5 లక్షల ఇస్తే అతను అన్ఫిట్ గా మారే సంస్కృతి రోజురోజుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెరిగిపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతమంది వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు, వైద్యులు డబ్బుకు కక్కుర్తి పడి, ఆరోగ్యవంతమైన వ్యక్తికి ‘మెడికల్ ఇన్వాలి డేట్’సర్టిఫికెట్లు జారీ చేయడంతో సదరు వ్యక్తి వారసులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కొంతమంది ఉద్యోగులు మెడికల్ లీవ్ లు పెట్టి, ఇలాంటి పైరవులకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇలాంటి ఉద్యోగులకు వారి వారి డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు కూడా లంచాలకు మరిగి ప్రోత్సహించడం జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా మెడికల్ బోర్డు ముందు అనారోగ్యం తీవ్రంగా ఉన్నట్లు నటించి, వైద్య అధికారుల తో మెడికల్ ఇన్వాల్వ్ డేట్ గా సర్టిఫికెట్ పొంది ఆ సర్టిఫికెట్ తో తన వారసులకు ఉద్యోగం ఇప్పించిన 2 సంవత్సరాల తర్వాత సదరు ఉద్యోగి ఆరోగ్యవంతుడిగా మారి కాఫీ షాపుల్లో, టిఫిన్ సెంటర్లో, కనిపిస్తూ నాలుగు రోడ్ల వద్ద లెక్చరు ఇస్తూ కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నిజాయితీ కంటే లంచాలే ప్రధానం….?
ఒక ఉన్నత అధికారి స్వార్థం, బంధుప్రీతి నిరుద్యోగుల బతుకులను కాలరాస్తుందనే విషయాన్ని మరిచి, కొందరు అధికారులు వారి వారసుల అభివృద్ధి ద్యేయంగా లంచాలు పుచ్చుకుంటూ ఇలా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తూ, భవిష్యత్తు తరాల యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ‘నేటి భారతం’ ఉద్ఘటిస్తుంది. ఇలాంటి కేసుకు సంబంధించిన ఓ ఫైల్ గత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వద్దకు వెళితే, ఆయన ఆ ఫైల్ యొక్క అంతరంగాన్ని కనిపెట్టి సదరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి , తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం లేకపోవడంతో, ఇదే అదునుగా భావించి జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో కొంతమంది ఉద్యోగులు మెడికల్ ఇన్వాలి డేట్ సర్టిఫికెట్ పొందుటకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల పనితీరును ప్రభుత్వానికి నివేదించడంలో ఇంటెలిజెన్స్ నిద్రపోతుంది…?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉద్యోగుల, అవినీతిని ప్రభుత్వానికి నివేదించడంలో విఫలమైందని అందుకే ప్రతి శాఖలో ఇలాంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఇలాంటి అవినీతి, అక్రమ ప్రభుత్వ ఉన్నత అధికారులు, ఉద్యోగులపై డేగ కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘నేటి భారతం’ భావిస్తోంది. ఇకనైనా నిరుద్యోగుల భవిష్యత్తును అవినీతి సొమ్ముతో కాలరాస్తున్న అధికారులకు ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని నిరుద్యోగ ప్రజానీకం కోరుతుంది.











Leave a Reply